Type Here to Get Search Results !

ప్రకృతిలో 24 మంది గురువుల వివరాలు

0

యాదవ వంశానికి మూలపురుషుడు యదువు ఒక నాడు దత్తాత్రేయుని చూసి ఇలా ప్రశ్నించాడు. స్వామీ మీరెలా సదానంద, చిదానంద స్వరూపులై ఉండగలుగుతున్నారని అడిగాడు. అతడి ప్రశ్నకు దత్తాత్రేయుడు ఇలా సెలవిచ్చారు. నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుంచి జ్ఞానం సంపాదించాను. ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. తాను ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వాటి నుంచే తెలుసుకున్నానని వివరించారు. భూమి నుంచి క్షమా, పరోపకారత్వం; వాయువు నుంచి నిస్సంగత్వం, నిర్లేపత్వం; ఆకాశం నుంచి సర్వవ్యాపకతత్త్వం; జలం నుంచి నిర్మలత్వం, మాధుర్య స్నిగ్ధత్వం; అగ్ని నుంచి తేజస్సు, ఈశ్వరతత్త్వం; సూర్యుని నుంచి జలగ్రాహి, జలత్యాగి, లోకబాంధవుడు, సర్వలోకాలకు అతడొక్కడే అని తెలుసుకున్నాను. చంద్రుని నుంచి వృద్ధి క్షయాలన్నవి దేహానికే కాని, ఆత్మకు కావని; కామక్రోధాలకు వశమైతే ఆత్మానురాగం కోల్పోతారని పావురాల జంట నుంచి గ్రహించాను. 

దైవికంగా లభించిన దానికి తృప్తి చెంది, లభించని దానికి పాకులాడరాదని కొండచిలువ నుంచి, తనలో ఉన్న మనోభావాలను బయటపెట్టరాదనే నీతిని సముద్రం నుంచి అభ్యసించాను. సుఖమని భ్రమించి మోహమనే జ్వాలాగ్నికి బలి అయి, మృత్యువుకి చేరువవుతుందనే విషయాన్ని మిడత నుంచి; యోగి ఎవరినీ నొప్పించకుండా భిక్ష సంపాదించినట్టు, తేనెటీగ కూడా పుష్పాలకు బాధకలుగకుండా తేనెను సంగ్రహిస్తుంది... ప్రతీ పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్లే ఏ గ్రంథాన్ని, ఏ ఒక్క విషయాన్ని వదలకుండా శాస్త్రాధ్యయనం చేయాలనే సత్యాన్ని తేనెటీగ నుంచి తెలుసుకున్నాను. అలాగే తాను కష్టపడి కూడబెట్టిన తేనెను పరాయి వారికి వదిలేస్తుంది. అలాగే యోగులు రేపటి అవసరాల కోసం సంపాదించరు. 

తనకున్న స్త్రీలోలత్వం వల్ల ఏనుగు ఎంత బలవంతమైనదైనా, ఇతరులకు వశమవుతుంది. అందుకే స్త్రీలోలత్వం వల్ల బానిసలవుతామనే నిజాన్ని ఏనుగు నుంచి తెలుసుకుంటే, ఇతరులు సంపాదించిన వస్తువులను న్యాయాన్యాయాలు ఆలోచించకుండా అపహరించేవాడు నీచుడవుతాడని మధుహారీ ద్వారా గ్రహించానని స్వామీజీ అన్నారు. 
అమాయకత్వంతో లేడి వేటగాని వలలో చిక్కుతుంది. అందుకే అమాయకత్వం కూడదని దాని ద్వారా, జిహ్వ చాపల్యం ఎంతటి చేటు తెస్తుందో ఎరకు చిక్కిన చేప వల్ల; భౌతిక వాంఛలు, ధనాశకు లొంగి కాలాన్ని, సాధనాన్ని (మనశ్శరీరాలు) దుర్వినియోగం చేసుకోకూడదని ఓ వేశ్య జీవితం ద్వారా తెలిసింది. 

ఇతరులకు, తనకు మధ్య తేడాలు గ్రహించలేని వారితో పోటీపడటం మంచిది కాదని లకుముకి పిట్ట ద్వారా, పాపపుణ్యాలు తెలియక యోగితో సమానంగా ఉండాలని బాలుడి ద్వారా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబ గౌరవాన్ని కాపాడాలని కన్యక ద్వారా అభ్యసించాను. విలుకాడి నుంచి ఏకాగ్రత, తనకంటూ స్థిరనివాసం ఏర్పరుచుకోరాదని పాము జీవితం నుంచి, ఎన్నిసార్లు విఫలమైనా మళ్లీ మళ్లీ గూడును సృష్టించే సాలీడు ద్వారా ప్రయత్నం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని తెలుసుకున్నాను. 

భ్రమరకీటక న్యాయంలా మనసంతా భగవంతుని మీదే లగ్నంచేసి చివరకు ఆయనలోనే లీనమవ్వాలనేది పురుగు ద్వారా తెలుసుకున్నానని దత్తాత్రేయుడు వివరించాడు. ప్రకృతిలోని ప్రతి అణువుతోపాటు తన మనస్సు కూడా తనకు గురువేనని వెల్లడించాడు. తానే ఎందరో దేవతలు, రాజులు, మునులకు గురువైనా, అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుంచి నేర్చుకుంటూ వాటికి శిష్యుడు కూడా అయ్యాడు.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages