ప్రజాకవి మరియు తెలంగాణ ఉద్యమకారుడు
రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న" గా సుపరిచితులు. ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టబడింది.
కాళోజి నారాయణరావు
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.
జీవిత విశేషాలు
ఆయన 1914, సెప్టెంబరు 9 న (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.
కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయిత గా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.
ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939 లో హైదరాబాదు లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రం లో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమం లో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది
మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు. అతని మరణానంతరం ఆయన పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు
తెలంగాణ ల నిజాం జమానాల నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించిండు.
ఆర్యసమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు, అన్నీ కాళోజి భాగం పంచినయి.
సహ యువకుల్ని చైతన్యంలకి మళ్లించేటోడు. గాంధీ అహింసామార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించిండు.
నిజాం వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టిండు.
రచనలు ఆయన మరాఠీ, ఇంగ్లీషు,ఉర్దూ భాషల్లో పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగు లకి అనువదించాడు.
అణా కథలు
నా భారతదేశయాత్ర
పార్థివ వ్యయము
కాళోజి కథలు
నా గొడవ
జీవన గీత
తుదివిజయం మనది
తెలంగాణ ఉద్యమ కవితలు
ఇదీ నా గొడవ
బాపూ!బాపూ!!బాపూ!!!
1943 లోనే ఆయన కథల్ని "కాళోజీ కథలు" పేరుతో అప్పట్లో హైదరాబాదులో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణాగ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది.
*పురస్కారాలు
1992 : పద్మవిభూషణ్ - భారత రెండవ అత్యున్నత పురస్కారం
1972 : తామ్రపత్ర పురస్కారం.
1968 : "జీవన గీత" రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనువాద పురస్కారం.
బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే 1981లో సత్కారం.
"ప్రజాకవి" బిరుదు.
ఆంధ్రప్రదేశ్ లో అనేక సాహితీ సంఘాలచే సన్మానాలు.
రామినేని ఫౌండేషన్ అవార్డు
గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ వారు 1992 లో డాక్టరేట్ ప్రదానం చేసారు.
1996లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు.
1996లో కళసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం