Type Here to Get Search Results !

పెద్దల మాట వినాలి

0

ఒక ఊళ్లో నలుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు ఒక ముని దగ్గరకు వెళ్లి, ఎవ్వరికీ నేర్పని విద్య ఏదైనా నేర్పమని కోరారు. అయితే అటువంటి విద్యలతో ఇబ్బందే తప్ప ఉపయోగం ఉండదని ఆ ముని చెప్పాడు. అయిన్పటికీ నేర్పమని పట్టుపట్టారు ఆ నలుగురు. తప్పేది లేక ముని ఆ నలుగురికీ నాలుగు ప్రత్యేక విద్యలను నేర్పాడు. వారు ఆ విద్యలను నేర్చుకుని, తమ ఊరికి ప్రయాణమయ్యారు.



ఒక అడవిగుండా ప్రయాణిస్తూండగా మార్గమధ్యంలో వాళ్లకి కొన్ని ఎముకలు కనిపించాయి. అవి చూడగానే ఆ నలుగురికీ తమ తమ విద్యలను ప్రదర్శించే అవకాశం దొరికిందనుకుని సంతోషం కలిగింది.


మొదటివాడు ఎముకల వాసన చూసి ‘ఇవి సింహం ఎముకలు’ అన్నాడు.

రెండవవాడు ‘నేను నా విద్యతో వీటన్నిటినీ కలిపి అస్థిపంజరం చేస్తాను’ అని అలాగే చేశాడు.

మూడవవాడు, ‘నా విద్యతో ఈ అస్థిపంజరంపై మాంసాన్ని, చర్మాన్ని తెస్తాను’ అని, మంత్రం చదివి, సింహాన్ని తయారుచేశాడు.


నాలుగవ వాడు ‘ఇప్పుడు నా విద్యను ప్రదర్శిస్తాను చూడండి’ అని మంత్రం చదివి ఆ సింహానికి ప్రాణం పోశాడు. దానికి ప్రాణం వచ్చింది.


వెంటనే సింహం లేచి కూర్చుంది. ఆ నలుగురు తమ తమ విద్యలు విజయవంతమైనందుకు సంతోషించారు. ఇంత మంచి విద్యలని ఇంతకాలం నేర్చుకోకుండా ఉన్నందుకు బాధపడ్డారు. ‘ఇక బయలుదేరదాం’ అనుకుంటూ ఉండగా వాళ్లు ప్రాణం పోసిన సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది.


ఎదురుగా ఉన్న నలుగురినీ చూసింది. తమ వల్ల ప్రాణం పోసుకున్న సింహం తమనేమీ చేయదనుకున్నారు నలుగురు స్నేహితులు. కానీ, ఆ సింహం అమాంతం వాళ్లని చంపి, తినేసి తన దారిన తాను వెళ్లిపోయింది.పెద్దల మాట వినాలి. లేకపోతే ఈ నలుగురు స్నేహితులకి జరిగినట్టే నష్టం వాటిల్లుతుంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages