జననం :: 1875 అక్టోబరు 31 (నాడియర్, గుజరాత్)
మరణం :: 1950 డిసెంబరు 15 (వయసు 75) (ముంబయి)
సంతానం :: మణిబెన్ పటేల్, దాహ్యాబాయి పటేల్
Profession :: న్యాయవాది
స్వతంత్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బర్డోలీ వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ముందు నుంచీ విభజించు పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు మత ప్రాతిపదికన దేశాన్ని రెండు ముక్కలు చేశారు. అలాగే వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్లో కలవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్గా వల్లభాయ్ పటేల్ మన్ననలు అందుకున్నారు. జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎలాంటిందో భారత యూనియన్లో స్వదేశీ సంస్థానాలు వీలినంలో పటేల్ ఉక్కు సంకల్పం అలాంటిది.
1947 నాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరుతుగా ఇండియన్ యూనియన్లో అంతర్భాగమయ్యాయి. మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80 శాతం ప్రజలు హిందువులు, మిగతా 20 శాతం ముస్లింలు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటంతో హైదరాబాద్ను స్వంతంత్ర రాజ్యంగా ఉంచాలనే ఆలోచన ఆయనది.
మరికొంత కాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్లో విలీనం చేస్తానని ఏడో నిజామ్ ప్రతిపాదించాడు. కానీ నిజాం వైఖరిపట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు ఒప్పుకోలేదు. నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ఇదే సరైన సమయంగా భావించిన పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబరు 13 న ప్రారంభమైన ఆపరేషన్ మూడు రోజులు పాటు కొనసాగి అదే నెల 17 న ముగిసింది.
సైనికచర్యను ప్రధాని నెహ్రూ వ్యతిరేకించినా ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా హైదరాబాద్ ప్రజలకు కిసాన్ వీరుడు విముక్తి కలిగించారు. నెహ్రూ యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు ఇదే సైనిక చర్యకు సరైన సమయంగా భావించిన పటేల్ ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీచేశారు. కశ్మీర్ది మరో విచిత్రమైన పరిస్థితి. ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్లో కశ్మీర్ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఉత్తర కశ్మీర్లోని వేర్పాటు వాదులు దీన్ని వ్యతిరేకించారు. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించినా అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ దీనికి అంగీకరించలేదు. అప్పుడే గనుక నెహ్రూ ఒప్పుకుని ఉంటే కశ్మీర్ సమస్య ఇంతవరకు వచ్చుండేది కాదేమో.
బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం
1875 అక్టోబరు 31న గుజరాత్లోని నాడియాడ్లో జవేరీ భాయి, లాడ్లా పటేల్లకు నాల్గవ సంతానంగా వల్లభభాయి పటేల్ జన్మించాడు. జవేరీభాయి వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. జవేరీ భాయి పేట్ లావ్ తాలూకాలోని కరంసాద్ గ్రామంలో జన్మించాడు. సామాన్య గృహస్థుడైనా 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి దళంలో పోరాడాడు.[2]
వల్లభాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరి లో సాగించారు. స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.
తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.
36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని,ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు.
జాతీయ నేతగా
బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జరుగుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928లో బార్డోలీలో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది.
1940, బాంబే, ఏ.ఐ.సి.సి. మీటింగులో గాంధీ, మౌలానా ఆజాద్ లతో పటేల్. గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసారు.
1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు.
రాజ్యాంగ సభ సభ్యుడిగా
భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు.
కేంద్ర మంత్రిగా
దేశ స్వాతంత్ర్యం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను, ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు.
నెహ్రూతో విబేధాలు
భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ను గెలిపించారు.
మరణం
1950 డిసెంబరు 15 న వల్లబ్ భాయి పటేల్ కన్నుమూశాడు. ముంబాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర్య సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు, నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.
Click Here to Download PDF copy of Patel
ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ