🙏తల్లి మాటలోని మహత్తు!!
అనగనగా ఒక బాలుడు.
అతడికి జట్కాబండిలో ప్రయాణించడమంటే చాలా ఇష్టం. అతడు ఇంటినుంచి రోజూ బడికి వెళ్లేది
జట్కాలోనే. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని బడిలో పిల్లల్ని టీచరు అడిగారు. ఒకరు
డాక్టరవుతానని, ఇంకొకరు ఇంజినీరవుతానని, మరొకరు లాయరు అవుతానని చెబుతుండగా, ఈ బాలుడు మాత్రం జట్కావాలా
అవుతానని జవాబిచ్చాడు.
టీచరు, పిల్లలు గొల్లున నవ్వారు
బాలుడు ఇంటికి
చేరే లోపలే ఈ కబురు ఊరికీ, ఊళ్లోని తల్లికి అందిపోయింది.
ఇంటికి రాగానే
తల్లి ప్రశాంతవదనంతో బాబూ! పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావని అడిగింది. అతడు పాత సమాధానమే
చెప్పాడు. ఆమె తప్పకుండా అవుదువుగానీ, ఇలా
రా అంటూ పూజామందిరం తలుపులు తెరిచింది.
ఒక్క గుర్రంతో
నడిపే బండిని కాదు బాబూ, నాలుగు గుర్రాలు నడిపే
బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో, ఆ శ్రీకృష్ణుడిలాగా - అని బోధించింది ఆ తల్లి..
ఆ నాలుగు గుర్రాల
పేర్లు ధర్మ, అర్థ, కామ,
మోక్షాలనీ, ఆ విషయాలను బోధించే జట్కావాలా జగద్గురువైన
శ్రీకృష్ణుడనీ చెప్పింది. నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి,
సరేనా! అంటూ అతడి ఆలోచనను చక్కని మలుపు తిప్పింది.
ఆ బిడ్డడే పెరిగి
పెద్దయ్యాక వివేకానందుడుగా మనందరికీ తెలిసిన నరేంద్రుడు.
🙏 నిజమైన పెంపకం అంటే అదే. పిల్లలు తెలియక తప్పు చేసినా తప్పు మాట్లాడిన దానిని
సరిదిద్దాల్సిన ది తల్లి అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు. నిజంగా, అమ్మ మాటలో ఎంత మహత్తు వుంది కదా!