గాడిద గుడ్డు
(జాతీయం కథ)
.jpg)
పూర్వం ఒక
పండితుడు కాశీకి బయలుదేరాడు. కాశీకి చేరుకునే లోగా సరుకులు మోస్తున్న గాడిద
అనారోగ్యంతో చనిపోయింది. ఎలాగూ వెళ్ళేది కాశీకే కాబట్టి, కాశీలో
ఉత్తరక్రియలు చేస్తే, గాడిదకు ఉత్తమ గతులు కలుగుతాయని
పండితుడు ఆశించాడు. గాడిద కాళేబరాన్ని మోయించుకుని కాశీకి తీసుకువెళ్లాడనికి
నిర్ణయించుకున్నాడు. కాశీ ప్రయాణం ఒక్కరు చేసేది కాదు కదా, సమూహంతో
వెళ్ళాలి. సమూహంలో మిగతావాళ్ళు గాడిద కాళేబరాన్ని కాశీకి తీసుకువెళ్లడానికి
ఒప్పుకోలేదు. శరీర భాగాలన్నింటిలో శిరస్సు ప్రధానమైనది కాబట్టి తలకి అంత్యక్రియలు
చేసినా సరిపోతుందని సమాధాన పరచుకున్నాడు. గాడిద తల నరికించి, ఎవరికి చెప్పకుండా, రహస్యంగా మూటకట్టి, పట్టుకుని బయలుదేరాడు. రెండు రోజులు గడిచేసరికి గాడిద తల కంపు కొట్టడం
మొదలెట్టింది. ఈ బాధ పడలేక అందరూ తిడతారని భయపడి 'సర్వేంద్రియానామ్
నయనం ప్రధానం' కాబట్టి కనీసం కనుగుడ్డుకైనా అంత్యక్రియలు
చేయాలనుకున్నాడు. జాగ్రత్తగా గాడిద కనుగుడ్లు తీసి డబ్బాలో పెట్టి తలను అక్కడే
వదిలేసి కాశీ చేరుకున్నాడు. అక్కడ గాడిద గుడ్డుకు దహనసంస్కారం చేశాడు. చుట్టుపక్కల
ఉన్నవారికి అర్థం కాక "దేనిని దహనం చేస్తున్నారు?" అని అడిగారు. "గాడిద గుడ్డు" అన్నాడు పండితుడు. చెప్పడం ఇష్టం
లేకనో, ఏమి లేదనే ఉద్దేశ్యంతోనో గాడిద గుడ్డు అన్నాడని
అనుకున్నారు అందరూ. అప్పటి నుంచి "కాశీ వెళ్లి ఏం తెచ్చావు? అంటే ఆఁ... గాడిద గుడ్డు" అనడం ఆనవాయితీ అయ్యింది. అప్పటి నుంచి మనం
చెప్పేది ఎదుటివారికి ఒక కట్టుకథలా అనిపించి ‘నేను నమ్మను' అని
తేలికగా చెప్పే సందర్భంలోనూ “ఏమీ లేదు” అని చెప్పే సందర్భంలోనూ 'గాడిదగుడ్డు' అనే జాతీయాన్ని వాడుతున్నారు.